
మొన్నా మధ్య TANA సభలకి వాషింగ్టన్ DC వెళ్ళినప్పుడు బోలెడన్ని తెలుగు పుస్తకాలు కొనుక్కొచ్చుకున్నా. చాలావరకు చదివేయడం అయింది.చదివేసి ఊరుకోడం సరికాదు గనుక చదివాక మనకేం అర్ధం అయింది అనేది అందరితో పంచుకోవాలి గనుక నాలుగు ముక్కలు బరికేద్దామని నిర్ణయించా.
నేనిప్పుడు పరిచయం చేస్తున్న పుస్తకం పేరు "అస్తమించని రవి". రచయిత ఖాదర్ మొహియుద్దీన్. "పుట్టుమచ్చ" అనే ముస్లింవాద కవిత ద్వారా ప్రసిద్ధుడు.
ముందుమాటలొ రచయిత, పరిటాల రవి తాను ఫ్యాక్షనిస్ట్ ని కాదని నిరూపించుకునే ప్రయత్నం సఫలీకృతం కాకుండానే హత్య చేయబడ్డాడని, ఆ లోటు ని ఈ పుస్తకం కొంతవరకయినా తీరుస్తుందని ఆశిస్తున్నానని అభిప్రాయపడ్డాడు. అదే ముందుమాటలొ ఇంకో చోట "ఏ ముహుర్తాన గద్దరన్న(గద్దర్) పరిటాల రవిని పరిచయం చేసాడో గానీ, ఆ తర్వాత నేను పూర్తిస్థాయిలో రవి మనిషిగా మారిపోయాను" అని అంటాడు.
అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు చాలు అన్నట్లుగా, ఈఒక్క వాక్యం చాలు- మున్ముందు పుటల్లో పుస్తకం ఎలా ఉండబోతోందీ,ఏ కోణంలో మనం రవిని చూడబోతున్నాం అనే విషయం ఊహించడానికి.
మీకు పరిటాల నచ్చినా, నచ్చకపోయినా ఈ పుస్తకం మాత్రం బాగా చదివిస్తుంది.రాయలసీమ లొ, ముఖ్యంగా అనంతపురం జిల్లాలో 5 దశాబ్దాలుగా కొనసాగుతున్న నరహంతక ఫ్యాక్షన్ ప్రవృత్తినీ,దాని పుట్టుపూర్వోత్తరాలనీ, ఫ్యాక్షన్ కి వ్యతిరేకంగా జనం పోరాటాన్ని,అందులో పరిటాల కుటుంబం పాత్రని వివరిస్తుంది.
రవి గురించి జనబాహుళ్యంలో చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. రవిని రాబిన్ హుడ్ గా చూపించేవి కొన్ని. నెత్తురు తాగే ఫ్యాక్షనిస్టుగా చూపించేవి మరికొన్ని.ఈ పుస్తకంలో రవి ఆయుధాల్ని ఎందుకు పట్టాల్సి వచ్చిందో వివరించే "జస్టిఫికేషన్" ఉంది. కానీ రవి ఫ్యాక్షనిస్టు ఎందుకు కాదో రచయిత వివరించలేకపొయాడు. కొన్నిచోట్ల పక్షపాతం ప్రదర్శించినట్లుగా అనిపిస్తుంది.మరికొన్ని చోట్ల, ముఖ్యంగా రవి చేశాడని చెప్పబడ్తున్న హత్యల ప్రస్తావన వచ్చినప్పుడు, రచయిత దాటవేత ధోరణి అవలంబించాడనిపిస్తుంది.ఆ హత్యలు రవి చేసినవి కాదేమో, పీపుల్స్ వార్ గ్రూప్ చేసినవేమో అనే అనుమానం చదువరుల్లో రేకెత్తించే ప్రయత్నం కనబడ్తుంది.
ఏతావాతా చెప్పొచ్చేదేమంటే, "చరిత్ర" లో ఒక కోణం తెలుసుకోడానికి ఒకసారి చదవదగ్గ పుస్తకమే.కానీ ఇదే జరిగిన చరిత్ర అని మనల్ని నమ్మించగలిగే విశ్వసనీయత ఈ పుస్తకానికి ఉందా అంటే సందేహాస్పదమే.
పుస్తకం చదివాక మాత్రం ఒకటి అనిపిస్తుంది. కత్తి పట్టినవాడు ఆ కత్తి చేతిలోనే మరణిస్తాడు అని. ఆ ఫ్యాక్షన్ పద్మవ్యూహమే అలాంటిది. అందులోకి వెళ్ళడమే గాని, బయటికి రావడం అనేది బహు అరుదు.అది కేవలం వైయెస్ కి మాత్రమే సాధ్యం అయింది ! (ఇందులో ద్వంద్వార్ధం ఏమి లేదని గమనించగలరు)
వైయెస్ ని ఫ్యాక్షన్లోంచి బయటికి తీస్కురాగలం గానీ, వైయెస్ లో ఉన్న ఫ్యాక్షనిస్ట్ ని మాత్రం బయటికి తీయలేం అని విపక్షాల వాళ్ళూ, స్వపక్షాల వాళ్ళూ చమత్కరించడం వేరే సంగతి అనుకోండి !
కొసమెరుపు:
ఇదే వ్యక్తి పరిటాల రవీంద్రా రెడ్డి అయి ఉంటే అసలు ఈ వ్యక్తికి, కథకి,అతని హత్యకి ఇంత ప్రాముఖ్యత ఉండేదా,అతనికి అంత శతృత్వం ఉండేదా, వైయెస్ ప్రభుత్వం రాగానే అతని హత్య జరిగేదా, తెలుగుదేశం పార్టీ అంతగా రియాక్ట్ అయ్యేదా, తెలుగుదేశం అభిమానులు గుంటూరు,కృష్ణా జిల్లాల్లో అన్నగారి విగ్రహం పక్కనే ఇప్పటిలాగానే ఇతని విగ్రహాలు పెట్టి ఉండేవాళ్ళా(1989 లో కోస్తా జిల్లాల్లో వంగవీటి రంగా విగ్రహాల్ని ఇందిరమ్మ,రాజీవ్ విగ్రహాల పక్కన పెట్టినట్లుగా) ,2004 ఎన్నికల సమయంలో పార్టీలకి అతీతంగా రాయలసీమలో అంతటి పోలరైజేషన్,అన్ని రాజకీయ సమీకరణలు జరిగి ఉండేవా, ఇదే విధంగా చనిపోయిన బాంబుల శివా రెడ్డి లాంటి ఫ్యాక్షనిస్ట్ తెలుగుదేశం నాయకుల్ని TDP ఎందుకు అంతగా "గ్లోరిఫై" చేయలేదు ........ఈ ప్రశ్నలన్నీ నా మదిలో మెదుల్తున్నాయి..మీకు సమాధానం తెలిస్తే చెప్పండి.
2 comments:
anna ni kosamerupu adirindi. correctga cheppaav present politics gurinchi
chandu
నాకు కూడా పంచె కన్నా అంచే బాగా నచ్చింది..అదెనండీ కొసమెరుపే బాగుంది.
Post a Comment