Monday, December 24, 2007

నిస్సంస్కృతీకరణ (de-sanskritization)

నిన్న రాత్రి చంద్ర కన్నెగంటిగారితో మాట్లాడుతున్న సందర్భంలో వచ్చిన ఒక ప్రస్తావన, ఈ రోజు ఆంధ్రజ్యోతిలో చూసిన ఒక వార్త ఈ పోస్ట్ రాయడానికి పురిగొల్పాయి.

ప్రఖ్యాత సామాజిక శాస్త్రవేత్త ఎం.ఎన్.శ్రీనివాసన్ సంస్కృతీకరణ (sanskritization) అనే పదాన్ని బాగా వ్యాప్తిలోకి తెచ్చారు.(Ref: Caste in Modern India and other Essays by M.N.Srinivasn). భారతదేశ కులవ్యవస్థని విశ్లేషిస్తూ ఆయన చాలా రచనలు చేశారు.

కులవ్యవస్థలో కింది మెట్ల మీద ఉన్న కులాలు తమ కులానికి "గౌరవం","ప్రామాణికత" ఆపాదించుకోడం కోసం కొన్ని బ్రాహ్మణ ఆచారాలు, కట్టుబాట్లు,పధ్ధతులు,పూజా విధానాలు పాటిస్తారని,ఆ విధంగా చేయడంవల్ల కులాలనిచ్చెనలో ఇంకో మెట్టు పైకి ఎదిగే అవకాశం ఉందనీ ఆయన అంటారు. శాకాహారం తినడం,పూజల్లో మాంసం నిషిధ్ధం చేయడం, బ్రాహ్మణ పూజార్లతో పూజలు చేయించడం(గ్రామదేవతల జాతర్లలో కూడా),పండగదినాల్లో మాంసం తినకపోడం (కొన్ని మినహాయింపులతో)..ఇవన్నీ కొన్ని ఉదాహరణలు. ఇంకా మంగలి కులం తమని "నాయీ బ్రాహ్మణులు" గా, కంసాలివాండ్రు తమని "విశ్వబ్రాహ్మణులు" గా సంభోధించుకోడం,జంధ్యం ధరించడం, చాకలి, మంగలి వంటి పురాతన తెలుగు పదాలకన్నా క్షురకుడు, రజకుడు వంటి సంస్కృత పదాలు గౌరవప్రదంగా భావించడం వంటివి మరికొన్ని ఉదాహరణలు. స్థూలంగా సంస్కృతీకరణ అర్ధం ఇది.తర్వాత రోజుల్లొ ఈ పదం పరిధి చాలా విశాలంగా,కులవ్యవస్థ చారిత్రక పరిణామక్రమం మదింపుకి కూడా అన్వయించబడిందనుకోండి.అలాగే ఈ భావన తాలూకు పరిమితుల గురించి కూడా చాలా పరిశోధన జరిగింది.జరుగుతూనే ఉంది.

ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు అంటే, 1962లో శ్రీనివాసన్ చూసిన, విశ్లేషించిన కులవ్యవస్థకి,45 సంవత్సరాల పరిణామక్రమంలో ఇప్పుడు వచ్చిన మార్పుకి ఉన్న తేడాని నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నా. ఆంధ్రప్రదేశ్ కులవ్యవస్థ దృష్ట్యా చూసినట్లయితే గత 15 సంవత్సరాల్లో ఇదే సంస్కృతీకరణ వ్యతిరేకదిశలో జరుగుతున్నట్లుగా కనబడ్తున్నది.అంటే కులాలనిచ్చెన మీద పై మెట్టులో ఉన్న కులాలు ఒక మెట్టు దిగి తమని "నిమ్నకులాలు" గా ప్రకటించమని ప్రభుత్వాల్ని కోరడం కనబడ్తున్నది. కాపులని బి.సి.కులాల జాబితాలో చేర్చమని విజ్ఞప్తి చేయడం,ప్రభుత్వం దాని అధ్యయానికి ఒక కమిషన్ నియమించడం ఒక ఉదాహరణ. రజకుల్ని ఎస్.సి జాబితాలో చేర్చమని విజ్ఞప్తి చేయడం ఇంకో ఉదాహరణ.

అయితే ఇక్కడొక చిన్న తిరకాసు ఉంది. కేవలం రిజర్వేషన్ వ్యవస్థ వల్ల వచ్చే లాభాలని పొందడానికి మాత్రమే ఈ కోరిక కోరుతున్నారా లేక నిజంగా సామాజిక హోదా పరంగా కూడా ఏ కులమయినా ఈ రోజు తమని తాము "నిమ్నకులం"గా భావిస్తున్నారా అనేది పెద్ద ప్రశ్న.

ఇక్కడ ఇంకో వైరుధ్యం కూడా ఉంది.నిమ్నకులస్తులు ఆర్ధిక అసమానతల వల్ల కోల్పోయే అవకాశాల్ని రిజర్వేషన్లద్వారా వారికి తిరిగి కల్పించి,సామాజికంగా వారి హోదాని,స్థాయిని పెంచడం రిజర్వేషన్ వ్యవస్థ పుట్టడానికి మూలకారణం. కానీ ఇప్పటికే సామాజికంగా కొంత మెరుగయిన స్థాయిలో ఉన్న కులాలు ఆర్ధికపరమయిన అవకాశాల్ని రిజర్వేషన్ల ద్వారా అందిపుచ్చుకోవాలనుకోడం కోసం ఒక మెట్టు దిగి తమని "నిమ్నకులాలు" గా ప్రకటించాలని కోరడం మన వ్యవస్థలో వచ్చిన ఒక వైచిత్రి.

అనుకున్న విధంగా కాకపోయినా,రిజర్వేషన్లు సామాజిక అంతరాల్ని ఇంకో విధంగా తొలగిస్తున్నట్లు కనబడ్తున్నది ! ఈ కోరికల వెనుక ఓటుబాంకు రాజకీయాలు ఉన్నాయనేది వేరే పార్శ్వం. కానీ ఈ పరిణామాలన్నీ నాకు మాత్రం నిస్సంస్కృతీకరణ (de-sanskritization) లాగా కూడా కనబడ్తున్నాయి. ఈ పదం ఉందో లేదో నాకు తెలియదు. శ్రీనివాసన్ బహుశా ఇదే పదం వాడి ఉండేవారేమో !

కవులు కూడా కడపకేనా ?

కొద్దివారాలుగా చిన్న వివాదం నడుస్తున్నది.బమ్మెర పోతన తెలంగాణాలోని వరంగల్(ఏకశిలానగరం)కి చెందినవాడా, లెకుంటే కడప జిల్లాలోని ఒంటిమిట్టకి చెందినవాడా అని.
ఈ వివాదం ఇప్పటిది కాదు(ట).వందేళ్ళ క్రితమే మొదలయి,చల్లబడి,ప్రస్తుతం జరుగుతున్న కడప ద్విశతాబ్ది ఉత్సవాల సందర్భంగా తిరిగి రేగింది.

మంత్రి గల్లా అరుణకుమారి, కడప కలెక్టరు మీడియా ముఖంగా పోతన కడపజిల్లావాడే అని చెప్పినారుట.ఇహ ఇరువేపులా వాదప్రతివాదాలు మొదలయినాయి. తెలంగాణ రచయితల తరపున మొన్నీమధ్యే ఒక పత్రికాప్రకటన వెలువడింది.పోతన తెలంగాణావాడే అని.కాదు కాదంటూ అటువేపు నుండి నిరూపణలూ, సాక్ష్యాధార సమర్పణలూ పత్రికాముఖంగా జరుగుతున్నాయి.ఆసక్తి ఉన్నవాళ్ళు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వ్యాసాలు చూడండి.

ఈ పోస్ట్ కి లేబుల్ తగిలించేప్పుడు ఇది సాహిత్యమా..రాజకీయమా అనే మీమాంస వచ్చింది నాకు. ఇంకో కొత్త లేబుల్ పెట్టాలేమో. "రాజకీయసాహిత్యం" లేదా "సాహిత్యరాజకీయం" అని !
ప్రస్తుతానికి ఇది "కాలక్షేపం" గుంపుకి వెళ్తుంది అనుకుంటా !

ఐదవ తెలుగువెన్నెల విశేషాలు !


16వ తేదీన రైస్ వన్ రోల్ రెస్టారెంట్లో జరిగిన ఐదవ తెలుగువెన్నెల ఈసారి ఎక్కువమంది సాహితీ ప్రియుల్ని ఆకర్షించింది. కాలం గడిచేకొద్దీ సమావేశాలకి హాజరవుతున్న సాహితీ ప్రియుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.ముదావహం.


చంద్ర కన్నెగంటిగారు తెలుగు కథా సాహిత్యం మీద మాట్లాడ్డం ఈసారి ప్రత్యేకత. ఇంతకు మునుపు పద్యకవిత్వం ప్రధానంగా జరిగిన సమావేశాలు ఈసారి చంద్రగారి వల్ల ఆధునిక సాహిత్య ప్రక్రియ అయిన కథవేపు దృష్టి మరల్చాయి. పూర్తి ప్రసంగంలా కాకుండా కొంత చర్చాగోష్టిలా సాగడం కూడా ఈసారి కనబడింది. బహుశా చంద్ర "మనవూరివాడు" అవడం వల్ల,వేదిక సభ్యులకీ,వక్తకీ గతంలోకన్నా కొంత సామీప్యత "క్రియేట్" అయినట్లుగా నాకు అనిపించింది.మున్ముందు కూడా ఇదే స్ఫూర్తితో సమావేశాలు జరిగితే బాగుంటుందెమో.


ఇంకో విశేషం ఎక్కువమంది మహిళలు హాజరవ్వడం.క్రమం తప్పకుండా వచ్చే చిలుకూరి అన్నపూర్ణగారితో పాటు మంజులత కన్నెగంటి,డా శ్రీ దేవి,సుభాషిణి,వీణ,అన్నపూర్ణ నెహ్రూ..ఇలా చాలామంది మహిళా సాహితీప్రియులు రావడం నిజంగా సంతోషదాయకం.


రెండు నెలల గైర్హాజరీ తర్వాత ఆళ్ళ శ్రీనివాసుడు, పులిగండ్లవారూ కనిపించారు.సంతోషం !
భాస్కర్,మంజులత కన్నెగంటి గార్ల కవితా పఠనం, జువ్వాది రమణ గారి (సిరివెన్నెల సీతారామశాస్త్రి) గేయాలాపన బాగున్నాయి.


ఈ సందర్భంగా మిత్రులందరికీ ఒక చిన్న సూచన. కేవలం కవితల్ని,గేయాల్ని, పద్యాల్ని చదవడం,పాడటమే కాకుండా వాటికి తగిన వ్యాఖ్యానం (స్వంతదయినా లేదా ఇతరులదయినా)జోడిస్తే మరింత ఆసక్తికరంగా ఉంటుందేమో ఆలోచించండి.


మొత్తానికి సభ చక్కగా జరిగింది. కొసమెరుపుగా జాగ్స్ గారు చంద్రగారిని ప్రశంసిస్తూ పద్యమేదో చెప్పారు. జాగ్స్ గారూ ! ఆ పద్యమేదో ఇక్కడ పోస్ట్ చెయకూడదూ ?


కొత్త సంవత్సరంలో జరగబోయే ఆరవ సమావేశానికి మందపాటి సత్యంగారు ముఖ్య అతిధి అని ప్రకటించారు ఎంవీయెల్ ప్రసాద్ గారు. అయితే జనవరి నెలలో కూడా పసందయిన సాహితీవిందు ఉందన్నమాట !