Wednesday, January 9, 2008

భారతరత్న ఎన్టీఆర్

వాజపేయి గారికి భారతరత్న పురస్కారం ప్రకటించవలసిందిగా అద్వానీగారు ప్రభుత్వానికో లేఖ రాశారంట.నిస్సందేహంగా ఆ పురస్కారానికి ఆయన అర్హుడని చాలమంది అభిప్రాయం. సందర్భం వచ్చింది కనుక, అన్నగారికి అదే పురస్కారం ఇంకా ఎందుకు ప్రకటించలేదనే ప్రశ్న నాలాంటి అభిమానుల్ని తొలిచివేస్తున్నది.

చంద్రబాబు కేంద్రరాజకీయాల్లో "చక్రం" తిప్పినన్ని రోజులూ అన్నగారికి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించనివ్వలేదంటారు.నిజంగా ఆయన తల్చుకుంటే ఆ రోజుల్లో అది నిమిషాల్లో జరిగే పని. కానీ భారతరత్నగా అన్నగార్ని ప్రకటిస్తే, గణతంత్రదినోత్సవంలో ఆ పురస్కారాన్ని ఎన్టీఆర్ వితంతువు హోదాలో లక్ష్మీపార్వతి అందుకోడం చంద్రబాబుకి ఇష్టం లేదని, అందుకే ఆ ప్రతిపాదనకి ఆయన మోకాలడ్డాడని ఆయన మనసు తెలిసినవారు గుసగుసలాడుకుంటారు.బహుశా ఎన్టీఆర్ కుటుంబసభ్యులు కూడా అందుకే ఎక్కువ వత్తిడి చేయలేదంటారు.

ఎన్టీఆర్ గారి అమ్మాయి పురంధ్రేశ్వరి ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్నారు.ఆవిడ కృషి చేసి అన్నగారికి భారతరత్న పురస్కారాన్ని ప్రకటింపజేయాలని అభిమానుల కోరిక. అందులోనూ మొన్నీమధ్యే ఆవిడ ఎన్టీఆర్ సరికొత్త వారసుడిగా వైయెస్ ని ప్రకటించి ఉన్నారు గనుక కాంగీయులకి కూడా పెద్ద అభ్యంతరం ఉండకపోవచ్చు.

ఈ జనవరి 18కి అన్నగారు అమరులయ్యి పుష్కరకాలం పూర్తవుతుంది. బతికి ఉన్నప్పటికంటే ఎక్కువగా చంద్రబాబు తెదేపా వారు అన్నగార్ని ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు. ప్రజలకి గుర్తు చేస్తున్నారు. విచిత్రంగా కాంగీయులు కూడా అన్నగారి పధకాలని పొగిడేస్తూ అవే అమలు చేస్తాం అంటున్నారు. ఇహ చిరంజీవి రాజకీయరంగ ప్రవేశవార్తల వల్ల కూడా అన్నగారిని తరచుగా ప్రస్తావిస్తున్నారు. పనిలో పనిగా మాయావతి వ్యాఖ్యల్ని ఖండించడానికి కూడా. ఇంతగా అన్నగార్ని గుర్తు చేసుకుంటున్న వీళ్ళంతా కనీసం అద్వానీలాగా ఒక ప్రకటన అయినా పడేస్తే బాగుంటుందేమో!