పాత రోజుల్లో శ్రోత్రియ బ్రాహ్మణ వ్యావహారికంలో "అబ్బాయికి ద్వితీయం (ట)" అనేవాళ్ళు. అంటే రెండో పెళ్ళి అని. అకస్మాత్తుగా అదెందుకు గుర్తొచ్చింది అంటే , ఈనాడు,ఆంధ్రజ్యోతి వంటి వార్తాపత్రికలు, ఇంకా నానారకాల గాసిప్ లు వ్రాసే సైట్లూ..ఒహటేమిటి..ఎక్కడ చూసినా ఒకటే హడావిడి.
"తృతీయం" అని..అంటే మూడో పెళ్ళి కాదు సుమండీ !
రాష్త్రంలో రాజకీయ సమీకరణాలు మూడో ప్రత్యామ్నాయాన్ని సృష్టించే దిశగా మారుతున్నాయి అని views papers భోగట్టా !
జనాభా లొ 4%-5% ఉన్న కమ్మ దొరలూ, 6%-8% ఉన్న రెడ్డి రాజులు మాత్రమే రాష్ట్రాన్ని గత 50 ఏళ్ళుగా పరిపాలిస్తున్నారు.కాంగ్రెస్ రెడ్ల పార్టీగా, తెలుగుదేశం కమ్మవారి సొత్తుగా మారిపోయింది అని ఆ రెండు పార్టీల్లో ఉన్న "వెనుకబడిన" (పదవుల్లో కాదులెండి) వర్గాల నాయకులు, మరికొంతమంది BC సంఘాల నాయకులు గొంతెత్తి చెబ్తున్నారు !
నిజానికి 1983 కి ముందు తారకరాముడు ఆంధ్రరాజకీయ యవనిక మీద అవతరించేదాకా కమ్మ-రెడ్డి సోదరులు అధికారాన్ని బాగానే పంచుకున్నారు. సింహభాగం రెడ్డి సోదరులది.కాంగ్రెస్ లో ఉన్న కమ్మసోదరులకి కొంతమేరకు ప్రాముఖ్యత. గొడవంతా నాదెండ్ల భాస్కర్రావ్ బదులు భవనం వెంకట్రాం రెడ్డి ని ముఖ్యమంత్రిని చేయడంతో మొదలయింది.కోస్తా కమ్మవాడిని కావడం వల్లనే తనకి ఆ పదవి రాకుండా రెడ్లు అడ్డుకున్నారని ఆయన బాధ.తెలుగు దేశం పార్టీ పుట్టుకకి గల సవాలక్ష చారిత్రక కారణాల్లో ఇదొకటి.
NTR (తెలుగుదేశం) వెనుక వ్యూహకర్తగా నాదెండ్ల వేసిన "వెనుకబడిన వర్గాల" ఎత్తుకి కాంగ్రెస్ చిత్తయింది.అప్పటిదాకా ఇందిరమ్మ ఏం చేసినా, ఏ పధకాలు పెట్టినా అవన్నీ SC/ST లకే దక్కుతున్నాయి..పైగా అధికారంలో ఏమాత్రం భాగస్వామ్యం లేదు అనే వెనుకబడిన (BC) కులాల అసంతృప్తిని తెలుగుదేశం విజయవంతంగా ఓట్ల రూపంలోకి మార్చుకుని అధికారంలోకి వచ్చింది.
ఇదిగో..సరిగ్గా అప్పటినుంచే "వేరే(కులం)వాడి భుజం మీద తుపాకీ ఉంచి ప్రత్యర్ధిని కాల్చడం" అనే (కమ్మ-రెడ్డి)రాజకీయ టక్కుటమార గోకర్ణ విద్యాప్రదర్శన మొదలయింది.మొదటిసారిగా BC లని అడ్డం పెట్టి, రెడ్ల రాజకీయ ఆధిపత్యానికి కమ్మలు అడ్డుకట్ట వేశారు. ఇహ ఆ తర్వాత కరణీకాల రద్దు విషయంలో బ్రాహ్మణుల్ని "కమ్మ" పాలనకి వ్యతిరేకంగా కూడదీయడంలో కాంగ్రెస్ రెడ్లు కొంతమేరకు కృతకృత్యులయ్యారు. కానీ తెలుగుదేశానికి/ కమ్మ పాలనకీ అసలయిన దెబ్బ తగిలింది 1989 లోనే. కాంగ్రెస్ రెడ్లు 1983లో TDP కమ్మలు వేసిన అస్త్రాన్ని వాళ్ళ మీదకే ప్రయోగించారు. ఈసారి తుపాకీ మోసిన భుజం కాపు సోదరులది. రంగా హత్య, తదనంతర పరిణామాలతో రెడ్లకే మళ్ళీ అధికారం చేజిక్కింది. తిరిగి 2004 లో ఇదె సూత్రాన్ని రాజశేఖర రెడ్డి విజయవంతంగా ఉపయోగించగలిగాడు.
ఇదంతా చూస్తే మనకో సందేహం రావొచ్చు. TDP కాంగ్రెస్ ల మధ్య పోటీ కమ్మ-రెడ్డి వర్గాల మధ్య అధికారపోరుగా ఎందుకు చిత్రీకరించబడ్తున్నది అని. ఎందుకంటే గత 20 సంవత్సరాల్లో రాష్త్ర రాజకీయాల్లో అంతర్లీనంగా ప్రారంభమయిన ఈ ట్రెండ్ 2004 ఎన్నికల సమయానికి నిర్లజ్జగా బహిర్గతమయ్యింది.
ఉండవల్లి భుజంపైన తుపాకీ పెట్టి వైయెస్ రామోజీని కాల్చడం, గుంటూర్ మేయర్ పదవికి కన్నా ని రాయపాటికి చెక్ గా పెట్టడం, కొస్తా జిల్లాల్లో నియోజకవర్గాల పునర్విభజన..ఇవి కొన్ని ఉదాహరణలు.
ఇక చంద్రబాబు కర్నూలు జిల్లాలో కెయి క్రిష్ణమూర్తి వర్గాన్ని, ఫరూక్ ని భూమాకి (రెడ్లకి) సమాంతరంగా తయారు చేయడం, కడప లో రాంచంద్రయ్య లాంటి బలిజ నాయకుల్ని ఎదిగేట్టు చేయడం రాయలసీమలో రెడ్లకి చెక్ పెట్టడానికి చేసిన ప్రయత్నంలానే కనబడ్తుంది.
మొహమాటానికి, మర్యాద కోసం, కాదని మనం సర్ది చెప్పుకున్నా అక్కడ జరుగుతున్నది అదే.
ఇప్పుడు ఈ తృతీయ ప్రత్యామ్నాయం రావల్సిన అవసరం చాలా ఉంది. రెడ్లు (90 పై చిలుకు), కమ్మలు (25 దాక) కలిపి మొత్తం 125 మంది MLA లు ఉన్నారు ప్రస్తుత అసెంబ్లీ లొ. రాష్త్ర జనాభా 10 కోట్లు అనుకుంటే మొత్తం కమ్మ-రెడ్ల జనసంఖ్య కోటికి మించదు.ఈ కోటి మందిలో రెడ్డి అయినా, కమ్మ అయినా సరిగ్గా కులం వల్ల అధికారాన్ని అనుభవించేవాళ్ళు, లాభపడేవాళ్ళు, సంపాదించేవాళ్ళు మొత్తం మీద 25 వేలకి మించరని నా అంచనా. పోనీ ఒక లక్ష మంది.
మిగిలిన 99 లక్షలమందీ "ఊపెకుహ"లే.ఏదో "మా కులానిదే అధికారం" అని తుత్తి తప్ప వీళ్ళకి ఒరిగేదేం లేదు. పైగా కులాల గొడవలు..కక్షలూ, కార్పణ్యాలు తప్ప దానికి తోడు అధికారంలో భాగస్వామ్యం లేని మిగతా కులాలతో అకారణ శతృత్వం,ద్వేషం ఏర్పడటం ! పైగా ఏ పని చేసినా వాడు ఫలానా కులం కాబట్టి ఆ సందర్భంలో అలా చేశాడు అని ఒక రకమయిన TAG ..అలానే చేస్తాడు అని ఒక brand !
ఏ కులపోడు అధికారంలో ఉన్నా సామాన్యుడికి ఒరిగేదేం లేదు. అందరికీ తెలిసిందే అది !అందుకనే రాష్త్రంలో తృతీయ ఫ్రంట్ రావాలి..
కనీసం సంబంధం లేని విషయాలకి బూతులు తిట్టించుకునే బాధ తప్పుద్ది !