నెల్లూరు జిల్లా పేరుని పొట్టి శ్రీరాములు జిల్లాగా పేరు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది అని వార్త.
పొట్టి శ్రీరాములు గారు చిరస్మరణీయులు. ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం అసువులుబాసిన ఆ మహనీయుడ్ని సముచితరీతిన స్మరించుకోడం, గౌరవించుకోడం తెలుగువారి కనీస ధర్మం.
కానీ భారతదేశ చరిత్రలో "నెల్లూరు సీమ" అనే పేరు ఎన్ని శతాబ్దాలనుండో ప్రాచుర్యంలో ఉంది. ప్రాచీన శాసనాల్లో, కావ్యాల్లో, జానపదుల నోళ్ళల్లో నెల్లూరు అనే పేరు ప్రసిధ్ధం. పల్లవ,చోళ,చాళుక్య,కాకతీయ,విజయనగర సామ్రాజ్యాల్లో భాగమయి,విక్రమ సింహపురిగా, మనుమసిధ్ధి రాజధానిగా ప్రసిధ్ధమయి,తిక్కనతో ప్రస్తావించబడింది.నెల్లూరు నెరజాణ, నెల్లూరు బియ్యం అనే పదాల్ని వినని తెలుగువాడెవ్వడు ?
అంతటి ఘనచరిత్ర కలిగిన ఈ పేరుని మార్చడం అంత సమంజసమా అని నాకు అనిపిస్తుంది. పొట్టి శ్రీరాములు గారి పేరా లేదంటే ఇంకో మహానుభావుడి పేరా అనేది కాదు ఇక్కడ సమస్య. అసలు ఈ పేర్లు తగిలించే సంస్కృతి మూలాల్ని నాశనం చేస్తున్న తీరు బాధ కలిగిస్తున్నది.
యూనివర్సీటీలకి, విమానాశ్రాయాలకి,రోడ్లకి, ప్రాజెక్టులకి,అన్నిటికి నాయకుల పేర్లు పెడ్తున్నారు.బాగుంది. కొత్తగా కట్టేవాటికి ఏ పేరు పెట్టుకున్నా బాధ లేదు. కాని వందల ఏళ్ళుగా జనం నోళ్ళల్లో నానుతున్న పేర్లని మార్చేయడం ఆ మహనీయులకి ఏ విధమయిన నివాళో అర్ధం కాదు.
ఇంతకుమునుపు నెల్లూరు,గుంటూరు,కర్నూలు జిల్లాల్ని విడదీసి,కలిపి 1970 లో ఒంగోలు జిల్లాని సృష్టించారు.ఒంగోలు కూడా చాలా ప్రాచీనమయిన, ప్రసిధ్ధమయిన పేరు. 1972 లో దాని పేరు ప్రకాశం జిల్లాగా మార్చారు. ఒంగోలు జిల్లాని ప్రకాశం పేరుతో పిలవడం వల్ల ఆ మహానుభావుడికి కొత్తగా వచ్చే గౌరవం ఏమిటి ?
1978 మార్చ్ లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే, వారి మామగారు కొండా వెంకట రంగారెడ్డి గారి పేరు మీద రంగారెడ్డి జిల్లాని సృష్టించారు. అది కావాలని చేశారో, కాకతాళీయమో తెలియదు మరి.
మొన్నా మధ్య కృష్ణాజిల్లాని NTR జిల్లాగా పేరు మార్చాలని అభిమానులనుండి ఒక వెర్రి కోరిక. ఏమిటీ వెర్రి ? ఇంకో 20 ఏళ్ళు పోతే ఏ జిల్లా పేరు ఎలా మార్చేయగలరో ఊహిస్తే వళ్ళు జలదరిస్తుంది.
అసలు ఆ మహానుభావులేమన్నా అడిగారా మా పేర్లు పెట్టండి అని ? దీనికి అంతెక్కడ? ఒక పక్క బాంబే ముంబాయిగా, మెడ్రాస్ చెన్నయిగా పాతపేర్లు తగిలించుకుంటూ ఉంటే మనకేమిటి ఈ పైత్యం ?
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
గతంలో విశాఖపట్నం పేరు విశాఖగా మారుస్తూ అప్పటి నగరపాలసంస్థ నిర్ణయం తీసుకుంది,కానీ ఉహూ ఏమీ స్పందన లేదు,ఎంతంటే ఏఒక్కరు ఆపేరును పట్టించుకున్నపాపాన పోలేదు.మీరు చెప్పినట్లు ముంబయి,బెంగలూరుల కోవలోకి పోవాలంటే ఏ సిం హపురి అనో పెట్టమంటారు. దాని కంటే పొట్టి శ్రీరాములు పేరే నయం కదా. విజయనగరం జిల్లాను పివిజిరాజు జిల్లాగ మార్చాలని ప్రతిపాదన వచ్చినప్పుడు మరికొందరు గురజాడ జిల్లాగా మార్చమన్నారు. అది తెదేపా వారి ఆలోచన కాగా ఇది కాంగ్రెస్ వారిది. రాష్ట్రానికి చెందిన మహనీయుల పేర్లను(ప్రకాశం,పొట్టి శ్రీరాములు,ఎన్ టీ యార్) ఏదో ఒక ప్రాంతనికి పరిమితం చేయటం వల్ల,వారి ఘనతకు భంగం ఉండదు కానీ పాలకుల సంకుచితత్వమే బయటపడుతుంది.నాకు తెలిసి ఇప్పటి వరకూ వైశ్యవర్గం అడిగిన ఏకైక పెద్ద కోర్కె ఇదే కాగా,ఇప్పటికైనా నెరవేరుస్తున్నదుకు మనమూ సంతొషిద్దాం. అసలు పొట్టి శ్రీరాములును కేవలం వైశ్యవర్గానికే పరిమితం అయ్యే విధంగా వచ్చిన దుస్తితికి అందరూ సిగ్గుపడాలి.
http://visakhateeraana.blogspot.com/
http://charchaavedika.blogspot.com
పెట్టేది పొటి శ్రీరామౌలు పేరు కదా, డైలమా లో పడేశారు , వై యస్ అంటే why yes యే...
నేను ముందే చెప్పినట్లు ఏ పేరు అనేది కాదు ముఖ్యం. తరతరాల చరిత్రగలిగిన ఒక పేరుని మార్చవలసిన అవసరం అసలేందుకు వచ్చింది అని.సింహపురి కంటే పొట్టి శ్రీరాములు నయమా అంటే అది కూడా గట్టిగా చెప్పలేం.ఉన్న పేరు బాగుంది.ఎప్పటినుండో ఉంది.అంతగా కావాలంటే సోమశిల ప్రాజెక్ట్ కి ఆయన పేరు పెట్టొచ్చు. తెలుగు విశ్వవిద్యాలయానికి ఆయన పేరే పెట్టారు. నెల్లూరులో ఇంకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి ఆయన పేరు పెట్టుకోవచ్చు గదా !
నెల్లూరు జిల్లాలో వున్న స్వర్గీయ పొట్టి శ్రీరాములు విగ్రహాలు ఎప్పుడూ చెత్తా చెదారాలతో నిండి వుండి పందులకి నెలవై ఉంటాయి.సంవత్సరానికి ఒక్కసారి తప్పితే ఆ విగ్రహాలకే దిక్కు లేదు. జిల్లాకి ఆ మహనీయుడి పేరు పెట్టగానే ఋణం తీరిపోతుందా? ఆంధ్ర రాష్ట్రాన్ని సంపాదించి పెట్టాడుకదా! జిల్లా కెందుకు? రాష్ట్రానికే పెట్టమనండి. అసలు "నెల్లు" అంటే వరి. ఆ పంట పుష్కలంగా పండే ప్రదేశం కాబట్టి దానికి పురాతన కాలం నుండి నెల్లూరు అని పేరు. ఈ పేరు రాజకీయాలు మన రాష్ట్రంలో వున్నంత ఛండాలంగా ఇంకెక్కడా లేవు.
Post a Comment