మందపాటి సత్యంగారు అతిధిగా విచ్చేసిన కొత్తసంవత్సరపు తెలుగువెన్నెల సమావేశం చక్కగా జరిగింది. చాలామంది డల్లాస్ మిత్రులకి ఆయనతో వ్యక్తిగత పరిచయం వల్ల,సమావేశం గుడిలో అవ్వడంవల్ల అనుకుంటా, వెన్నెల సమావేశం ఈసారి చిక్కబడింది.ఇంతమంది మిత్రులు హాజరవ్వడం శుభసూచిక.డా ఆళ్ళ శ్రీనివాసుడు సరాసరి ఎయిర్ పోర్ట్ నుండే వచ్చేశారులా ఉంది.ఆశుకవి డా తారాకుమార్, సాహిత్యాభిమాని డా బోయ సుబ్రమణ్యం,సుభాషిణి గార్లు మొదటిసారి వెన్నెల సమావేశానికి రావడం సంతోషదాయకం. వరసగా రెండో నెల ప్రసాద్ తోటకూర గారు లేని లోటు కనబడింది.
ఇహ సమావేశం వివరాలకొస్తే, ప్రొఫెసర్ బండ్ల రాగయ్య గారు పద్యాలతో వీనులవిందు చేశారు.ఎప్పుడో చిన్నప్పుడు విన్న వాణిముత్యాల్ని రాగయుక్తంగా మళ్ళీ వినిపించారు.జువ్వాది రమణ, నందివాడ ఉదయభాస్కర్ గార్లు పోటాపొటీగా నవ్వించారు తమ పేరడీ పాటలతో.సత్యం గారిని సభకి సరిగ్గానే పరిచయం చేశాననుకుంటున్నా. ఎన్నారై కబుర్లగురించి,తన రచనావ్యాసంగం గురించి మందపాటి గారు సాహిత్యవేదిక మిత్రులతో బాగా పంచుకున్నారు.భాష పరిణామక్రమం గురించి మందపాటి, తారాకుమార్,జాగ్స్ గారి వ్యాఖ్యలు కొత్త విషయాల్ని తెలియజేశాయి.తెలుగుపీపుల్.కాం కి చెందిన ప్రసాద్ కూనిసెట్టి గారిని సభకి పరిచయం చేసినందుకు యలమంచిలి రామచంద్రరావ్ గారికి ధన్యవాదాలు.
మొత్తానికి అన్నింటిలోకి గమ్మత్తు ఏంటంటే 40 మందికి ఆర్డరు చేసిన పకోడీల్ని మిత్రుడు గోపి వెళ్ళి పట్టుకొస్తే అవి తీరా ఇరవయిమందికి కూడా సరిపోనంత పరిమాణంలో ఉండటం. కానీ, మురళి,గోపి,నేను మా "హస్తలాఘవం" (వేరే అర్ధాలు వెతక్కండి) ప్రదర్శించి సరిపెట్టేశాం. సరిపెట్టుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు.
No comments:
Post a Comment